న్యూఢిల్లీలోని భారత్ మండపం ఇప్పుడు కేవలం టెక్నాలజీకే కాదు, అద్భుతమైన భారతీయ రుచులకు కూడా వేదికైంది. AI సదస్సుకు వచ్చిన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధాని మోదీ ‘శిశిర రుతువు’ థీమ్తో ఒక అద్భుతమైన విందు ఇచ్చారు. మన ఊరి చిరుధాన్యాల నుండి కాశ్మీరీ క్వా వరకు.. ప్రతి వంటకం భారతదేశ సంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని చాటిచెప్పేలా ఉంది. టెక్ నిపుణులు సైతం ఫిదా అయ్యేలా సాగిన ఆ విందు విశేషాలు మీకోసం..
నోరూరించే స్టార్టర్స్తో ఘన స్వాగతం: విందు మొదట్లోనే పాత ఢిల్లీ రుచులను గుర్తుచేస్తూ ‘వర్ణిల’ పేరుతో ఒక ప్రత్యేకమైన చాట్ను వడ్డించారు. పాలకూర క్రిస్ప్స్, పెరుగు గోళీలు, చింతపండు చట్నీలతో చేసిన ఈ వంటకం ప్రపంచ నేతలకు కొత్త అనుభూతిని ఇచ్చింది. దీనితో పాటు బీహార్, యూపీ ప్రాంతాల్లో ఫేమస్ అయిన పచ్చి బఠానీల ‘నిమోనా కబాబ్’, కాశ్మీర్ స్పెషల్ ‘నద్రు కుర్కురి’ (తామర తూడు చిప్స్) స్టార్టర్స్గా అలరించాయి. ఈ వంటకాలన్నీ తక్కువ కేలరీలతో, పూర్తి అలెర్జీ రహితంగా తయారు చేయడం విశేషం.

పర్వత ప్రాంతాల రుచులతో మెయిన్ కోర్స్: ప్రధాన భోజనంలో ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల రుచులు హైలైట్గా నిలిచాయి. ప్రత్యేకంగా పండించే ‘మున్శ్యారీ రాజ్మా గిలావత్’ పహాడీ రైస్ మరియు ‘ఝంగోరా’ (ఉదలు) పులావ్లు విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. వీటికి తోడుగా కుమావూనీ ఆలూ గుట్కే, సిల్కీ టమోటా-అనారి సాస్ వడ్డించారు. బ్రెడ్స్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ స్పెషల్ ‘తఫ్తాన్’ మరియు కాశ్మీరీ ‘గిర్దా’ రొట్టెలు భోజనానికి నిండుదనాన్ని ఇచ్చాయి. మన దేశంలోని వైవిధ్యాన్ని ఈ మెనూ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు.
స్వీట్ ఫినిషింగ్.. ఫ్యూజన్ మ్యాజిక్!: విందు ముగింపులో డెజర్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. భారతీయ ‘రసమలై’ని లాటిన్ అమెరికన్ ‘ట్రెస్ లెచెస్’ కేక్తో కలిపి చేసిన ‘రసమలై ట్రెస్ లెచెస్’ ఈ డిన్నర్కే స్పెషల్ అట్రాక్షన్. బాజ్రా (సజ్జల) పొడితో గార్నిష్ చేసిన ఈ స్వీట్ తిన్నాక, చివరగా కాశ్మీరీ క్వా, ఫిల్టర్ కాఫీ లేదా డార్జిలింగ్ టీతో అతిథులు సేదతీరారు. అలాగే భారతీయ గులాబీ రేకులు, మిశ్రి గుల్కంద్తో చేసిన ‘చాక్లెట్ పాన్’ ఆ రాత్రి విందును మధురమైన జ్ఞాపకంగా మార్చేసింది.
ఈ విందు కేవలం కడుపు నింపడానికే కాదు, భారతీయ వ్యవసాయం మరియు సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక వారధిలా పనిచేసింది. ముఖ్యంగా మన చిరుధాన్యాలకు (Millets) ఈ మెనూలో అగ్రతాంబూలం ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై భారత్ తన నిబద్ధతను చాటుకుంది. టెక్నాలజీ చర్చల మధ్య ఇలాంటి ‘దేశీ’ రుచులు తోడవ్వడం ప్రపంచ నేతలకు మరపురాని అనుభూతిని మిగిల్చింది.
ఈ విందు మెనూను ప్రత్యేకంగా అంతర్జాతీయ అతిథుల ఆహార అలవాట్లు మరియు ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకుని ఐటిసి (ITC) గ్రూప్ షెఫ్లు రూపొందించారు.
