త్వరలో భారత్‌కు 500 ఏళ్లనాటి హనుమాన్‌ విగ్రహం..!

-

500 ఏళ్లనాటి పురాతన హనుమాన్‌ విగ్రహం భారత్‌కు రానుంది. ఈ విగ్రహాన్ని భారత్‌కు అప్పగించనున్నట్లు అమెరికా వెల్లడించింది. వాషింగ్టన్‌లోని బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ రూమ్‌లో ఆ దేశ విదేశాంగ శాఖ దీపావళి వేడుకలను నిర్వహించింది.

సంస్కృతిని కాపాడేందుకు, దెబ్బతిన్న చారిత్రక భవనాలను రక్షించేందుకు, దొంగతనాలకు గురైనా చారిత్రక సంపదను తిరిగి సంపాదించేందుకు అమెరికా రాయబారులు సహకరిస్తారని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ, భారత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కలిసి 500 ఏళ్ల పురాతనమైన హనుమాన్‌ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. దానిని భారత ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

దక్షిణ భారత్‌లోని ఓ ఆలయంలోని 500 ఏళ్లనాటి హనుమాన్‌ విగ్రహాన్ని దొంగిలించి అమెరికాలోకి క్రిస్టీ ఆక్షన్‌ హౌస్‌కు విక్రయించారు. ఆ సంస్థ దానిని వేలంలో ఉంచగా ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. ఆక్షన్‌ సంస్థకు, ఆస్ట్రేలియాలోని కొనుగోలుదారుడికి ఆ విగ్రహం దొంగిలించినట్లు తెలియదు. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తం చేయడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొనేందుకు పూర్తిగా సహకరించారని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్ట్రేలియాలో స్వాధీనం చేసుకొన్న ఈ విగ్రహాన్ని అప్పట్లో అమెరికాకు అప్పగించారు. తాజాగా ఇప్పుడు అది భారత్‌కు చేరనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version