‘అదానీ’ స్పాన్సర్‌ అని.. అవార్డు తిరస్కరించిన కవయిత్రి

-

అదానీ-హిండెన్​బర్గ్ నివేదిక వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదానీ స్పాన్షర్​షిప్​ చేశారని.. ఓ కవయిత్రి తనకు ప్రకటించిన అవార్డును తిరస్కరించారు. దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూపు ఏటా ‘దేవి’ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది పురస్కారాలకు ఎంపిక చేసిన 12 మంది మహిళల్లో తమిళనాడుకు చెందిన రచయిత్రి, కవయిత్రి సుకీర్తరాణి ఉన్నారు. సాహిత్యం, దళిత సాహిత్యంలో విశేష కృషికి గాను ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

అయితే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి పారిశ్రామికవేత్త అదానీ ప్రధాన స్పాన్సర్‌ కావడంతో ఆ పురస్కారాన్ని తిరస్కరించినట్టు ఆమె వెల్లడించారు. ఇటీవలే హిండెన్‌బర్గ్‌ నివేదిక ద్వారా అదానీ ఆర్థిక నేరాల గురించి తెలిసిందని.. అందుకే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలిపారు. రాణిపేట జిల్లా లాలాపేటకు చెందిన సుకీర్త రాణి ఉపాధ్యాయురాలు. పలు పుస్తకాలు రాశారు. ఆమె కవితలు సమకాలీన రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. ఆమె 25 ఏళ్లుగా మహిళా హక్కులు, దళిత విముక్తి, స్త్రీ స్వేచ్ఛ, అణచివేతకు గురైన ప్రజల కోసం తన రచనలు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version