అశ్లీల వీడియోల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.2.53 కోట్లను ఆమె ఫ్రెండ్ భర్తే కాజేశాడు. ఈ ఘటన తాజాగా మంగళవారం హైదరాబాద్లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూకట్పల్లిలో హాస్టల్లో నివసిస్తుంది.
అదే హాస్టల్లో ఆమె చిన్ననాటి స్నేహితురాలు కాజా అనుషా దేవి కూడా ఉంటుంది.అనుషా దేవి భర్త నినావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ కూడా ఆమెకు పరిచయం అయ్యాడు. ఉద్యోగం లేక జల్సాలకు అలవాటు పడిన దేవనాయక్.. తన భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేశాడు. ఫోన్లో కొత్త సిమ్ కార్డు వేసుకొని బాధితురాలికి ఫోన్ చేసి..నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయి. ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడం ప్రారంభించాడు.
అతనే బెదిరిస్తున్నాడని తెలియక బాధితురాలు ఈ విషయాన్ని దేవనాయక్కు చెప్పుకుంది. దీంతో ఈ విషయం సెటిల్ చేస్తానని..కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని,అనేక సాకులు చెప్పి బాధితురాలి నుంచి దేవనాయక్ రూ.2,53,76,000 తీసుకున్నాడు. చివరకు అసలు విషయం తెలియడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు దేవానాయక్ను అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ.1,81,45,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.