నేటి డిజిటల్ యుగంలో పిల్లల చేతుల్లో స్మార్ట్ఫోన్ సర్వసాధారణం అయిపోయింది. అయితే, దీనివల్ల కలిగే అనర్థాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టం తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెక్నాలజీ వరమా లేక శాపమా అనే చర్చ నడుస్తున్న వేళ, భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది..
పిల్లల భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం: అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు ఒక కీలక విషయాన్ని లేవనెత్తారు. సోషల్ మీడియా వల్ల చిన్న పిల్లల మనస్తత్వాలు దెబ్బతినడమే కాకుండా, వారు తప్పుడు మార్గాల్లో వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 13 ఏళ్ల లోపు చిన్నారులను ఈ సోషల్ మీడియా మాయాలోకం నుంచి దూరం పెట్టాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి కానీ, అది జీవితాలను నాశనం చేసే ఆయుధంగా మారకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
90 రోజుల్లో కొత్త చట్టం సిద్ధం: ఈ నిబంధన కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఒక పటిష్టమైన చట్టంగా రూపుదిద్దుకోనుంది. వచ్చే 90 రోజుల్లోనే దీనిపై పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించి అసెంబ్లీలో చట్టం తెస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే వయోపరిమితి 13 ఏళ్లు ఉండాలా లేక 16 ఏళ్లు ఉండాలా అనే దానిపై మేధావులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. పిల్లల రక్షణే పరమావధిగా ఈ చట్టం పనిచేయనుంది.

గ్లోబల్ ట్రెండ్ను ఫాలో అవుతూ: కేవలం మన రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా దేశం 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని విధించింది. పోలాండ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా సీఎం సిద్ధరామయ్య ఇలాంటి ప్రకటనే చేశారు. ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని, మన పిల్లల భద్రత కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది.
మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యం: గతంలోనే మంత్రి నారా లోకేశ్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ దాడులు, వేధింపులపై గళమెత్తారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సోషల్ మీడియా బారిన పడి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కఠినమైన నిబంధనలు ఉండాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పిల్లలను డిజిటల్ వ్యసనం నుంచి కాపాడేందుకు, వారి వ్యక్తిగత గోప్యతను రక్షించేందుకు ఈ నిర్ణయాన్ని ప్రాధాన్యతగా తీసుకుంది.
తల్లిదండ్రుల బాధ్యత :టెక్నాలజీని మనం వాడుకోవాలి తప్ప, అది మనల్ని వాడుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం చట్టాలు తెచ్చినా, క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల జీవితాలు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, దానిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం నిషేధం కాదు, రేపటి తరాన్ని కాపాడుకునే ప్రయత్నం.
