చాలామంది స్టైల్ కోసమో, కళ్లద్దాల గోల వద్దనో కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. కానీ, ఆ లెన్స్ వేసుకుని ఈత కొట్టడం లేదా నీటిలోకి దిగడం ఎంత ప్రమాదకరమో తెలుసా? నీటిలో ఉండే కొన్ని కనిపించని సూక్ష్మజీవులు మన కళ్లను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేస్తాయి. అసలు ఈ నీటి ఇన్ఫెక్షన్ వెనుక ఉన్న అసలు కథేంటో, కంటి చూపు కాపాడుకోవడానికి నిపుణులు ఇస్తున్న ముఖ్యమైన సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీటిలో దాగి ఉన్న ఆ డేంజర్ ఏమిటి?: మనం ఈత కొట్టే స్విమ్మింగ్ పూల్స్, నదులు, చివరికి టాప్ వాటర్లో కూడా ‘అకాంటమీబా’ అనే పరాన్నజీవి ఉంటుంది. ఇక ఇది చాలా ప్రమాదకరమైన సూక్ష్మజీవి. మనం లెన్స్ వేసుకుని నీటిలోకి దిగినప్పుడు, ఈ క్రిములు లెన్స్ క్రింద చిక్కుకుపోతాయి.

కంటిపై దెబ్బ.. చూపు పోయే ప్రమాదం: కంటికి అంటుకున్న ఈ సూక్ష్మజీవి మెల్లగా కంటి కణజాలాన్ని (కార్నియా) తినడం ప్రారంభిస్తుంది. ఇక దీనివల్ల కంటిలో తీవ్రమైన నొప్పులు, ఎరుపుదనం, నీరు కారడం లాంటి సమస్యలొస్తాయి. దీనికి ‘అకాంటమీబా కెరటైటిస్’ అంటారు. సరైన సమయంలో గుర్తుపట్టి వైద్యం అందించకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదముంది.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈత కొట్టడానికి పూల్స్ లేదా నదుల్లోకి దిగే ముందు తప్పనిసరిగా లెన్స్ తొలగించాలి. లెన్స్ తీశాకే స్నానం చేయడం మంచి అలవాటు. ఇక లెన్స్ డిసిన్ఫెక్ట్ చేయడానికి కేవలం దానికి ఇచ్చే ప్రత్యేక సొల్యూషన్ మాత్రమే వాడాలి, మామూలు నీటిని అస్సలు వాడకూడదు. అంతేకాక లెన్స్ కేస్ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
ఇక కళ్లు మన జీవితానికి వెలుగునిచ్చే అమూల్యమైన అవయవాలు. చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కాంటాక్ట్ లెన్స్ విషయంలో నీటికి ఎంత దూరంగా ఉంటే మన కళ్లకు అంత రక్షణ ఉంటుంది.
గమనిక: కంటిలో ఎలాంటి మంట, నొప్పి లేదా ఎరుపుదనం అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సొంత వైద్యం అస్సలు చేయవద్దు.
