మీ జేబులో క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది! డిజిటల్ లావాదేవీల యుగంలో క్రెడిట్ కార్డ్ వాడకం ఎంత సులభమో దాని నిబంధనలు తెలియకపోతే అంతే ప్రమాదకరం. ఆర్బీఐ (RBI) మరియు బ్యాంకులు తాజాగా తీసుకువచ్చిన కొత్త నిబంధనలు మీ బిల్లింగ్ సైకిల్ నుంచి రివార్డ్ పాయింట్ల వరకు అన్నింటినీ మార్చేశాయి. ఈ మార్పులను గమనించకపోతే, మీ సిబిల్ స్కోర్ దెబ్బతినడమే కాకుండా భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి రావచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ కార్డ్ అంటే ‘ముందు వాడు.. తర్వాత కట్టు’ అనే వెసులుబాటు మాత్రమే కాదు, అదొక క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అస్త్రం. కానీ, ఇటీవలి కాలంలో బ్యాంకులు తమ ఛార్జీల విషయంలో, రివార్డ్ పాయింట్ల విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి.

బిల్లింగ్ సైకిల్లో మార్పులు: ఇప్పటివరకు బ్యాంకులు నిర్ణయించిన తేదీనే మీ బిల్ జనరేట్ అయ్యేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమకు నచ్చిన తేదీకి ‘బిల్లింగ్ సైకిల్’ను మార్చుకునే వెసులుబాటు కలిగింది. ఇది వినడానికి బాగున్నా, మీరు మార్పు చేసినప్పుడు పాత బకాయిల గడువు తేదీని సరిగ్గా గమనించకపోతే లేట్ ఫీజు పడే అవకాశం ఉంది.
రివార్డ్ పాయింట్లు మరియు ఛార్జీలు: చాలా బ్యాంకులు ఇప్పుడు రెంట్ పేమెంట్స్ (అద్దె చెల్లింపులు) మరియు యూటిలిటీ బిల్లులపై రివార్డ్ పాయింట్లను నిలిపివేస్తున్నాయి. అంతేకాకుండా రెంట్ పేమెంట్స్ కోసం కార్డ్ వాడితే అదనంగా 1% వరకు సర్ఛార్జ్ విధిస్తున్నాయి. మీరు రివార్డ్ పాయింట్ల కోసం వీటిని వాడుతుంటే ఒకసారి మీ బ్యాంక్ లేటెస్ట్ గైడ్లైన్స్ తనిఖీ చేసుకోండి.
కార్డ్ క్లోజర్ మరియు ఇన్యాక్టివిటీ: ఒకవేళ మీరు మీ క్రెడిట్ కార్డును ఏడాది కాలంగా వాడకుండా పక్కన పెడితే, బ్యాంక్ ముందస్తు సమాచారం ఇచ్చి ఆ కార్డును బ్లాక్ చేసే అధికారం కలిగి ఉంది. అలాగే, మీరు కార్డును క్లోజ్ చేయాలనుకున్నప్పుడు దరఖాస్తు చేసిన ఏడు పనిదినాల్లోపు బ్యాంక్ ఆ ప్రక్రియను పూర్తి చేయాలి, లేదంటే బ్యాంకు మీకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
కనీస గడువు తేదీ దాటిన తర్వాత కూడా పేమెంట్ చేయకపోతే, వడ్డీ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. కొన్ని బ్యాంకులు ‘మినిమమ్ డ్యూ’ చెల్లించినా మిగిలిన బకాయిపై చక్రవడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ చక్రబంధంలో చిక్కుకోకుండా ఉండాలంటే ‘టోటల్ అమౌంట్ డ్యూ’ చెల్లించడమే ఏకైక మార్గం.
