బ్రేకింగ్‌: విశ్వహిందూ మహాసభ చీఫ్ దారుణ హత్య..!

-

విశ్వహిందూ మహాసభ చీఫ్‌ రంజిత్‌ బచ్చన్‌ ఈ ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలోని హజరత్‌ గంజ్‌ లో ఉదయం మార్నింగ్ వాక్ కు రంజిత్ వెళ్లిన వేళ ఈ దారుణం జరిగింది. తన సోదరుడితో కలిసి ఆయన వాకింగ్ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్‌పై వచ్చి ఆయన్ను కాల్చి చంపారు. రంజిత్ తలలోకి బుల్లెట్ దిగడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన సోదరుడిని ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం ఆరు ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రంజీత్ బచ్చన్ నడుస్తుండగా ముందుగా అతని మెడలోని బంగారం చైన్ మరియు సెల్‌ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం దుండగులు చేశారని దీన్ని ఆయన ప్రతిఘటించడంతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. మరోవ్యక్తిపై కూడా కాల్పులు జరపగా అతనికి తీవ్రగాయాలవడంతో ట్రామా సెంటర్‌కు తరలించారు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుండగులు హత్య చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని కాని.. నేరాన్ని మాత్రం లూటీగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తామని అన్నారు. ఇటీవలి కాలంలో యూపీలో హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండవది కావడం గమనార్హం. 2019 అక్టోబర్‌ లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్‌ తివారీని కాల్చి చంపిన ఘటన తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version