ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవదు. షాపింగ్ నుండి చదువుల వరకు అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. కానీ, ఒక చేత్తో 5G వేగంతో దూసుకుపోతున్న మన దేశంలో, మరో చేత్తో ఇంకా 13.7 శాతం ఇళ్లకు ఇంటర్నెట్ వాసన కూడా తగలలేదంటే నమ్మగలరా? ప్రతి ఏడు ఇళ్లలో ఒక ఇంట్లో నేటికీ నెట్ సౌకర్యం లేదు. అభివృద్ధి అంటే కేవలం నగరాలదేనా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. వివరాలలోకి వెళితే..
అభివృద్ధి చెందుతున్నా అందని ఫలాలు: ఇప్పటికి మన దేశం AI (కృత్రిమ మేధ), 5G వంటి అత్యాధునిక సాంకేతికతలతో ప్రపంచంతో పోటీ పడుతోంది. డిజిటల్ పేమెంట్లలో మనం నంబర్ వన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని దాదాపు 13.7 శాతం కుటుంబాలకు ఇప్పటికీ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. డిజిటల్ సేవలు కేవలం పట్టణాలకే పరిమితం కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారు వెనుకబడిపోతున్నారు అన్నది నిజం.
ప్రాంతాల మధ్య పెరుగుతున్న అంతరం: ఇంటర్నెట్ వినియోగంలో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మెట్రో నగరాలు దాదాపు వంద శాతం డిజిటల్ వైపు అడుగులు వేయగా, తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇంకా ఇంటర్నెట్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో నెట్వర్క్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల పిల్లల చదువులు, ప్రభుత్వ పథకాల అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి.

డిజిటల్ గ్యాప్తో వచ్చే ఇబ్బందులు: ఇంటర్నెట్ లేకపోవడం అంటే కేవలం వినోదం లేకపోవడం కాదు. నేడు ప్రభుత్వం అందించే రేషన్ కార్డుల నుండి రైతు భరోసా పథకాల వరకు అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీదే నడుస్తున్నాయి. ఇక ఆన్లైన్ సౌకర్యం లేని కుటుంబాలు ఈ పథకాల గురించి అర్ధం కాక ఇతరుల మీద ఆధారపడటమో జరుగుతోంది. ఇది ఆర్థిక అసమానతలకు దారితీస్తోంది. 5G కాలంలో కూడా ఒక వర్గం ప్రజలు ఆఫ్లైన్లోనే ఉండిపోవడం ఆందోళనకరం.
డిజిటల్ ఇండియా అంటే కేవలం పట్టణాల్లో వేగవంతమైన నెట్ ఉండటం కాదు మారుమూల పల్లెల్లోని పేదవాడి ఇంటికి కూడా ఇంటర్నెట్ చేరడం. ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కలిసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినప్పుడే ఈ 13.7 శాతం అంతరం తొలగిపోతుంది. టెక్నాలజీ అనేది అందరి హక్కుగా మారాలి, అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం.
