వేసవి కాలంలో ఉక్కపోత తట్టుకోలేక ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఏసీలు, కూలర్లు కొనుక్కుంటాం. తీరా కొన్నాక అవి సరిగ్గా పనిచేయకపోయినా, రిపేర్ కోసం ఫోన్ చేస్తే కంపెనీలు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు మనకు ‘వినియోగదారుల రక్షణ చట్టం-2019’ (కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కంపెనీల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మనం లీగల్ గా ఫైట్ చేసి, రూ.1 లక్ష వరకు పరిహారం ఎలా సాధించవచ్చో ఇప్పుడు చూద్దాం.
మొదటి అడుగు.. నోటీసు ఇవ్వడం: మీరు కొన్న ఏసీ మెరాయించినప్పుడు లేదా కంపెనీ సర్వీస్ సరిగ్గా లేనప్పుడు మొదటగా సదరు కంపెనీకి ఒక లీగల్ నోటీసు పంపాలి. లేదా ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-4000 కు ఫోన్ చేసి మీ సమస్యను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక చాలా వరకు కంపెనీలు ఈ స్టేజ్లోనే దిగివచ్చి మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి.

ఈ-దాఖిల్ పోర్టల్ ద్వారా కేసు: ఒకవేళ మీరు నోటీసు పంపినా, కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేసినా కంపెనీ నుండి ఎలాంటి స్పందన లేకపోతే అస్సలు తగ్గాల్సిన అవసరం లేదు. ఇక మీరు నేరుగా కోర్టుల చుట్టూ తిరగకుండానే ‘ఈ దాఖిల్’ (e-Daakhil) అనే ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే చాలా ఈజీగా కేసు ఫైల్ చేయవచ్చు. ఇక మీ దగ్గర ఉన్న బిల్లులు,కంప్లైంట్ కాపీలను ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
రూపాయి ఫీజు లేకుండా క్లెయిమ్: చాలా మంది కోర్టు అనగానే ఖర్చవుతుందని భయపడతారు. కానీ కస్టమర్ ఫోరమ్లో రూ. 5 లక్షల లోపు విలువైన క్లెయిమ్లకు ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఉచితంగానే మీ హక్కుల కోసం పోరాడవచ్చు. అంతేకాదు, ఇక ఏసీ పనిచేయకపోవడం వల్ల మీరు పడ్డ ఇబ్బందికి, మానసిక వేదనకు పరిహారంగా రూ.1 లక్ష వరకు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.
కస్టమర్లే రాజులు అని ఊరికే అనలేదు. మనం డబ్బులు పెట్టి వస్తువును కొన్నప్పుడు సరైన సర్వీస్ పొందడం మన హక్కు. కాబట్టి ఏసీ కంపెనీలు చేతులెత్తేసినా, కస్టమర్ కేర్ వారు ముప్పతిప్పలు పెట్టినా భయపడకుండా ఈ చట్టాలను వాడుకోండి. మీ హక్కులను కాపాడుకోండి.
గమనిక: ఈ సమాచారం కేవలం వినియోగదారుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే అందించబడింది. చట్టపరమైన చర్యలు తీసుకునే ముందు, పూర్తి వివరాల కోసం అధికారిక ‘ఈ-దాఖిల్’ వెబ్సైట్ను సందర్శించడం లేదా లీగల్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
