సాధారణంగా మహిళలు టెక్నాలజీ రంగంలో రాణించడం అంటే అది కేవలం కోడింగ్కు పరిమితం అని అనుకుంటాం. కానీ, శ్రుతి మంత్రి గారి ప్రయాణం అందుకు భిన్నం. దేశాన్ని వణికించిన 26/11 ముంబై దాడుల దర్యాప్తు బృందంలో పని చేయడం నుంచి, నేడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లో కీలక బాధ్యతలు చేపట్టే వరకు ఆమె ప్రస్థానం ఎంతో ఉత్తేజితం సైబర్ భద్రత, డేటా సైన్స్ వంటి క్లిష్టమైన అంశాల్లో ఆమె సాధించిన విజయాలు నేటి యువతకు ఒక పాఠం.
26/11 దర్యాప్తులో కీలక పాత్ర: శ్రుతి మంత్రి గారి కెరీర్లో అత్యంత సాహసోపేతమైన ఘట్టం ముంబై దాడుల దర్యాప్తు. ఆ సమయంలో సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా ఆమె అందించిన సేవలు వెలకట్టలేనివి. డిజిటల్ ఆధారాలను విశ్లేషించడం, ఉగ్రవాదుల కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఛేదించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అప్పట్లో టెక్నాలజీ ఇంతగా అందుబాటులో లేకపోయినా తన మేధస్సుతో కేసు దర్యాప్తులో అండగా నిలిచారు.

పరిశోధన నుంచి బోధన వరకు:రెండు దశాబ్దాలుగా ఆమె టెక్నాలజీ రంగంలో నిరంతర పరిశోధనలు చేస్తున్నారు. కేవలం తాను నేర్చుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు ఆ జ్ఞానాన్ని పంచాలనే లక్ష్యంతో బోధన రంగంలోకి అడుగుపెట్టారు. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్స్ వంటివి మన జీవితాల్లో భాగం కాకముందే ఆమె వాటిపై పట్టు సాధించారు. ప్రస్తుతం ISB-హైదరాబాద్లో సీనియర్ అసోసియేట్ డైరెక్టర్గా ఉంటూ, డేటా సైన్స్ అప్లికేషన్స్పై ఎంతోమందికి దిశానిర్దేశం చేస్తున్నారు.
సైబర్ భద్రత మనందరి బాధ్యత: మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు అంతా సైబర్ సెక్యూరిటీపైనే ఆధారపడి ఉందని ఆమె తరచూ చెబుతుంటారు. ఇక డేటాను ఎలా భద్రపరుచుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమాజానికి మేలు చేసేలా ఎలా వాడాలి? అనే అంశాలపై ఆమె చేస్తున్న పరిశోధనలు నేటి డిజిటల్ యుగానికి ఎంతో అవసరం. మహిళలు టెక్ రంగంలోకి రావడం వల్ల విభిన్నమైన ఆలోచనలు, పరిష్కారాలు లభిస్తాయని ఆమె గట్టిగా నమ్ముతారు.
శ్రుతి మంత్రి గారు కేవలం ఒక టెక్ నిపుణురాలు మాత్రమే కాదు, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరుకోవచ్చని నిరూపించిన ధీశాలి. దేశ భద్రత కోసం పని చేసిన అనుభవం, నేడు ప్రపంచ స్థాయి విద్యాసంస్థలో హోదా.. ఇవన్నీ ఆమె నిరంతర శ్రమకు నిదర్శనం.
