మళ్లీ దోపిడీ చేసేందుకు మాయగాళ్ల వస్తున్నారు : మంత్రి గంగుల

-

తెలంగాణను మళ్లీ దోపిడీ చేసేందుకు మాయగాళ్ల వస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్‌. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వారి మాటలు నమ్మితే నీళ్లు, కరెంటు, బొగ్గును దోపిడీ చేసి రాష్ట్రాన్ని గుడ్డి దీపంగా మారుస్తారని ఆరోపించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం, కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం మంత్రి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి సమైక్య పాలనలో కరీంనగర్‌ వివక్షకు గురైందని, నిధులు రాక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు. స్వయం పాలనలో వందలాది కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సమైక్య పాలనలో తాగునీరు కావాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కే పరిస్థితులు ఉండేవని, నేడు స్వయం పాలనలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తుంటే విపక్షాల నాయకులు మాయ పాటలు చెప్పేందుకు వస్తున్నారని, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలమ్మకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఇక్కడ పాదయాత్రలు ఎందుకు చేస్తుందని నిలదీశారు. దొంగల మాటలు నమ్మొద్దని, కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం కలిగించాలనే ధ్యేయంతో పేదలు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ మానవతకు మారుపేరన్నారు.

కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్లు, ఉచిత విద్య, కరెంటు రైతుబంధు రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం పట్టించుకోలేదని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి రూ.3.70కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version