మనకు ఏవైనా సందేహాలు వస్తే వెంటనే ఏఐని అడిగేస్తున్నాం, సెకన్లలో సమాధానం పొందుతున్నాం. కానీ మనం అడిగే ఒక్కో ‘ప్రాంప్ట్’ వెనుక ఎంత విద్యుత్ ఖర్చవుతుందో, ఏఐ సెంటర్లు చల్లబడటానికి ఎన్ని బిలియన్ల గ్యాలన్ల నీరు అవసరమో తెలుసా? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రకృతిపై పడుతున్న ఈ భారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఏఐ వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న ఆ ‘అదృశ్య’ ఖర్చుల వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒక్క చిన్న ప్రశ్న.. ఇంత కరెంటా?: మనం ఏఐకి ఇచ్చే ప్రతి కమాండ్ లేదా ప్రాంప్ట్ వెనుక భారీ సర్వర్ల పనితీరు ఉంటుంది. లెక్కల ప్రకారం, ఒకే ఒక్క ప్రాంప్ట్ కోసం 0.34 వాట్ అవర్స్ విద్యుత్ అవసరమవుతోంది. వినడానికి ఇది తక్కువగానే అనిపించినా, ఒక యూజర్ రోజుకు సగటున చేసే వాడకంతో 6.8 వాట్ అవర్స్ ఖర్చవుతోంది. ఇదే లెక్కన 100 మిలియన్ల మంది ఏఐని వాడితే, అది రోజుకు 6.8 లక్షల kWh విద్యుత్ వినియోగానికి దారితీస్తోంది. అంటే ఒక చిన్న నగరాన్ని నడపడానికి కావాల్సినంత విద్యుత్ అన్నమాట!
డేటా సెంటర్ల దాహం – బిలియన్ గ్యాలన్ల నీరు: ఏఐ పని చేయాలంటే వేల సంఖ్యలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUs) నిరంతరం తిరుగుతూనే ఉండాలి. ఈ క్రమంలో అవి విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. ఆ యంత్రాలను చల్లబరచడానికి (Cooling systems) భారీగా మంచినీటిని వాడుతున్నారు. గూగుల్ ఇచ్చిన నివేదిక ప్రకారం, కేవలం 2023లోనే ఏఐ డేటా సెంటర్ల నిర్వహణ కోసం ఏకంగా 6.1 బిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఉపయోగించారట. ఇది చూస్తుంటే టెక్నాలజీ దాహం ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది.

భవిష్యత్తుపై ఏఐ ప్రభావం: ప్రస్తుతం ఏఐ వాడకం ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తులో వీడియో జనరేషన్, లైవ్ అసిస్టెంట్స్ వంటి ఫీచర్లు పెరిగితే విద్యుత్ వినియోగం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడకుండా ఉండాలంటే, ఏఐ కంపెనీలు పునరుత్పాదక శక్తి వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. లేకపోతే డిజిటల్ విప్లవం మన సహజ వనరులను హరించివేసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం చేయగలిగింది ఏంటి?: టెక్నాలజీని వాడటం ఆపలేం కానీ, బాధ్యతాయుతంగా వాడటం మన చేతుల్లో ఉంది. అనవసరమైన ప్రాంప్ట్లు తగ్గించడం, గూగుల్ సెర్చ్తో సరిపోయే చిన్న చిన్న విషయాలకు ఏఐపై ఆధారపడకపోవడం వంటివి కొంతవరకు మేలు చేస్తాయి. కంపెనీలు కూడా ‘గ్రీన్ ఏఐ’ (Green AI) విధానాలను అమలు చేస్తూ, తక్కువ విద్యుత్తో పనిచేసే మోడళ్లను తయారు చేయాలి. అప్పుడే టెక్నాలజీ అభివృద్ధి పర్యావరణానికి శాపంగా మారకుండా ఉంటుంది.
ఏఐ మన జీవితాలను సులభతరం చేస్తోందన్నది ఎంత నిజమో, అది ప్రకృతిపై పెను భారం వేస్తోందన్నది కూడా అంతే నిజం. విద్యుత్, నీరు అనేవి మన ప్రాణాధారాలు. కాబట్టి అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత టెక్ దిగ్గజాలపై ఉంది. తెలివిగా ఏఐని వాడుదాం.. మన ప్రకృతిని కాపాడుకుందాం.
