ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్‌ గ్యాస్‌ ఇచ్చి ఖైదీకి మరణశిక్ష

-

ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి ఓ ఖైదీకి మరణశిక్ష విధించారు. ఈ విషయంపై ఇటీవలే ప్రకటన చేసిన అమెరికాలోని అలబామా జైలు అధికారులు ఈ వ్యవహారంపై ఎన్ని విమర్శలు వచ్చినా చివరకు చెప్పినట్లే శిక్ష అమలు చేశారు. 1988లో ఓ మతాధికారి భార్య ఎలిజబెత్‌ సెనెట్‌ను హత్య చేసిన కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58)కు దీనిని అమలు చేసినట్లు అలబామా పోలీసులు తెలిపారు. ‘డెత్‌ పెనాల్టీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌’ ప్రకారం ప్రపంచంలో స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ శిక్ష అమలును ప్రత్యక్షంగా వీక్షించడానికి ఐదుగురు మీడియా సభ్యులను అట్మోర్‌లోని హోల్మన్‌ కరెక్షన్‌ ఫెసిలిటీకి అనుమతించారు.

మరోవైపు మరణశిక్షకు ముందు స్మిత్‌ మాట్లాడాడు. అలబామా ఇవాళ మానవత్వాన్ని ఒక అడుగు వెనక్కి తీసుకెళుతోందని అన్నాడు. తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత అతడికి అధికారులు మాస్కును బిగించి దాని నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించగా ఏడు నిమిషాల్లో అతడు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరణ శిక్ష అమలు పూర్తైందని.. అతడి మరణాన్ని అలబామా గవర్నర్‌ ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version