అమెరికాకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.. బైడెన్​తో కీలక చర్చలు

-

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ అగ్ర రాజ్యం అమెరికాలో అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక చర్చలు జరిపేందుకు ఆయన యూఎస్​కు చేరుకున్నారు. జిన్‌పింగ్‌కు అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు.. సైనిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు.  అమెరికా- చైనా మధ్య సంబంధాలు పతనం దిశగా సాగుతున్న వేళ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సుకు బైడెన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం కాలిఫోర్నియాలో బైడెన్‌-జిన్‌పింగ్‌ సమావేశం కానున్నారు. ద్వై పాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్‌ అంశాలతో పాటు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలపై ఇరు దేశాల అధ్యక్షులు చర్చించనున్నట్లు సమాచారం.

ఇవే కాకుండా వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంలో అలజడులపై కూడా బైడెన్‌-జిన్‌పింగ్‌ చర్చలు జరపనున్నట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, ఉక్రెయిన్‌-రష్యా దాడులపై కూడా ఇరువురు నేతల భేటీలో చర్చకు  వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి.. అపోహలను తొలగించుకునేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version