ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్కు రానున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధాని మోదీతో సంభాషించిన అనంతరం మస్క్ ఈ ప్రకటన చేశారు. నరేంద్ర మోదీతో సంభాషించడం గౌరవప్రదంగా భావిస్తున్నట్లు మస్క్ తన పోస్టులో రాసుకొచ్చారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే మస్క్ భారత్లో పర్యటించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
వాణిజ్య ఒప్పందం కోసం భారత్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురు.. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని మస్క్ కు తెలిపినట్లు వెల్లడించారు. మోదీ ట్వీట్ కు స్పందనగా మస్క్ తన భారత పర్యటనను ధ్రువీకరించారు.