పనసపండు తియ్యటి రుచి, కమ్మటి వాసనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే పండు తిన్నాక చాలామంది దాని గింజలను పారేస్తుంటారు. నిజానికి పనస తొనల్లో కంటే గింజల్లోనే ఎన్నో అద్భుతమైన పోషకాలు దాగున్నాయి. మరి ఈ గింజలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? ముఖ్యంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు వీటిని తినవచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోషకాల ఖజానా – మెరుగైన జీర్ణక్రియ: పనస గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వులతో పాటు విటమిన్ ఎ, సి, బి-కాంప్లెక్స్, ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇక అలాగే కడుపు నిండిన భావన కలిగించి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం – మెరిసే చర్మం: ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఐరన్ శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే విటమిన్ సీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా?: మధుమేహం ఉన్నవారు పనస గింజలను ఉడికించి లేదా తక్కువ నూనెతో వండుకుని పరిమితంగా తీసుకోవచ్చు. ఇక అంతేకాక వీటిలోని ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తుంది. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి.
ఇక పనస గింజలు పోషకాల గని అని చెప్పవచ్చు. చెత్తలో పారేసే ఈ గింజలను సరైన పద్ధతిలో వండుకుని తింటే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
గమనిక: పనస గింజలు షుగర్ను పూర్తిగా నయం చేయలేవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు, ముఖ్యంగా మందులు వాడుతున్నట్లయితే వీటిని తమ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
