టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కి పార్లమెంట్ లో కీలక బాధ్యతలు…!

-

ప్రతిష్టాత్మకమైన కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే ఈ కమిటిలో సభ్యులుగా ఆయన ప్రాధాన్యత ఓటు ద్వారా ఎంపికయ్యారు. లోక్సభ నుంచి 15 మంది ఎంపీలతో పాటుగా ఏడుగురు రాజ్యసభ సభ్యులతో 22 మందిని ఈ కమిటికి ఎంపిక చేసారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పని తీరుని ఈ కమిటి మదింపు చేయనుంది.

జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు గాను మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి తన విధులు నిర్వహిస్తుంది. ప్రాధాన్యతా ఓటు ఆధారంగా రెండు సభలకు చెందిన ఎంపీలు ఈ కమిటీలో సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ కమిటీకి చైర్మన్ ను లోక్ సభ స్పీకర్ నిర్ణయిస్తారు. దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయటంతో పాటుగా… వాటి ఖాతాలను పరిశీలించటం, మరింత మెరుగ్గా పనిచేసేందుకు గాను ఈ కమిటీ కేంద్రానికి నివేదికలు ఇస్తుంది.

ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇచ్చే నివేదికలను కూడా పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ అధ్యయనం చేయడం గమనార్హం. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక నివేదికలు ప్రతీ ఏడు పార్లమెంట్ ముందు ఉంచే విధంగా ఈ కమిటి పర్యవేక్షి౦చనుంది. ఈ కమిటికి తాను ఎంపిక కావడంపై స్పందించిన సంతోష్ కుమార్… పార్లమెంట్ సభ్యుడిగా తన బాధ్యత మరింత పెరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా తమ కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. పలువురు తెరాస ఎంపీలు ఆయనకు అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version