రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా : వంగలపూడి అనిత

-

టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నారా లోకేశ్ పాదయాత్రలో సీఎం జగన్ కు సహకరిస్తూ మాట్లాడిందనీ, ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారనీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందరికి తెలిసిందే. అయితే, ఈ షోకాజ్ నోటీసులు ఫేక్ అని టీడీపీ ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ఈ వ్యవహారంపై వంగలపూడి అనిత ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని వెల్లడించారు. దాని ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేశారని ఆమె అన్నారు. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని తాను కోరుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకడు తథాస్తు అంటే, మరొకడు థ్యాంక్యూ ఆంటీ అంటూ ట్రోల్ చేశారని అనిత తెలిపారు.

రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడ్డారు. తాను తెలుగు మహిళ అధ్యక్షురాలినని, ఒక మాజీ ఎమ్మెల్యేనని, అంతకుమించి ఒక దళిత బిడ్డనని, ఆడపిల్లనని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను మాట్లాడిన మాటలను కూడా ఎడిట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటే వీళ్లను మనుషులు అనాలా, లేక పశువులు అనాలా, అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. జగన్ మళ్లీ సీఎం అవ్వాలనుకుంటే చేసిన మంచిపనులను సోషల్ మీడియాలో పెట్టుకోవాలని అన్నారు అనిత. ఈ ట్రోలింగ్ గురించి సాక్షి చానల్లో కూడా వేసుకుని వారు ఆనందం పొందారంటే ఇంతకుమించి అబద్ధపు మీడియా సంస్థ ఉంటుందా, అంటూ మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version