తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం

-

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్నిరోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్నీ నిండిపోయి, భక్తులు శిలా తోరణం వరకు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటలకు పైనే సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలిపిరి చెక్‌పాయింట్‌లో వెహికిల్స్ భారీగా నిలిచిపోయాయి.

అయితే, స్లాటెడ్‌ దర్శన టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకూ దాదాపు మూడు గంటల దర్శన సమయం పడుతోంది అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇక, వసతి సౌకర్యాల విషయంలో కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టీటీడీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది.

మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. పురటాసి శనివారాలకు తోడు, కొన్ని సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ వెల్లడించింది. దాంతో, ప్రతి రోజూ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్ల జారీ అక్టోబరు 1, 7, 8, 14, 15 తేదీల్లో రద్దు చేస్తున్నామని పేర్కొంది. భక్తులు ఈ మార్పును గమనించి, తమకు సహకరించాలని టీటీడీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version