రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్‌ వచ్చి విమర్శించారు : కేటీఆర్

-

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పీఎం మోడీ హైదరాబాద్‌ పర్యటనపై కేటీఆర్ ఆదివారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కేవలం రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్‌ వచ్చి విమర్శించారన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ మాదిరిగా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రం, దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని నోటినుంచి ఒక్క అభినందన కూడా రాలేదని మండిపడ్డారు. దేశంలోని అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వందశాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించామన్నారు.

ఐటీ రంగంలో ఉద్యోగ కల్పనలో దేశంలోనే ముందంజలో ఉన్నామని, తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ వృద్ధి 7.7 శాతంగా ఉన్నదని వెల్లడించారు. దేశంలో అత్యధిక అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని తెలిపారు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్‌ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో ప్రపంచ వ్యాక్సిన్‌ హబ్‌లు, అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు తెలంగాణ ప్రత్యేకతలు అన్నారు. సీఎస్‌డీఎస్‌ నివేదిక ప్రకారం దేశంలో అతితక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి పీఎం మోడీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version