గెలుపుకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమికి అందరిది బాధ్యత.. సమిష్టి బాధ్యత అని ఎంపీ మల్లు రవి అన్నారు. బిజెపి బిఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బిఆర్ఎస్ పూర్తిగా బిజెపి అభ్యర్థులకు సపోర్ట్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవక పోగా, డిపాజిట్లు పోగొట్టుకున్నారు. బిజెపి ఎమ్మెల్సీల సంఖ్య 3 కు పెరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగేది ఏం లేదు.
ఎమ్మెల్సీ ఫలితాలు చూపించి సంబురాలు చేస్తుంటే, ఆశ్చర్యంగా ఉంది. బిఆర్ఎస్ నేతలపై ఉన్న కేసుల విషయంలో భయపెట్టి, రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇతర ఎన్నికలకు సంబంధం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధం లేదు. రెండు సీట్లు రాగానే, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అన్ని మేమే గెలుస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎమ్మెల్యేల కోటాలో కచ్చితంగా సామాజిక న్యాయం ఉంటుంది. ఇన్చార్జిలు ఎవరు వచ్చినా అందరిది కాంగ్రెస్ సిద్ధాంతమే. గాంధీ సిద్ధాంతాలను మీనాక్షి నటరాజన్ అనుసరిస్తున్నారు అని మల్లు రవి పేర్కొన్నారు.