మోదీ ఇప్పుడు లీక్ పే స్పీక్‌ చర్చ పెడతారా.. నీట్‌ వ్యవహారంపై రాహుల్ ఫైర్

-

కేంద్రంలోని మోదీ సర్కార్‌ పేపర్‌ లీక్‌, మోసాలు లేకుండా ఏ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూజీసీ-నెట్‌ పరీక్షను రద్దు చేసిన వేళ ..కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతియేటా పరీక్ష పే చర్చ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ తమాషా చేస్తున్నారని…ఆయన ప్రభుత్వం మాత్రం పేపర్‌ లీకేజీలు, మోసాలు లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేకపోతోందని విమర్శించారు. నీట్‌, యూజీసీ-నెట్‌ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున..ప్రధాని మోదీ ఇప్పుడు లీక్‌ పే స్పీక్‌ చర్చ చేపడతారా అని నిలదీస్తూ ఎద్దేవా చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ లీకేజీలతో భవిష్యత్‌ ఆందోళనకరంగా మారినందున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నట్టు తెలుస్తోందని తెలిపారు.ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదన్నారు. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాలను నిలువరించినట్లు చెప్పుకునే ప్రధాని మోదీ పేపర్‌ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version