రిషి సునాక్‌ గెలవాలని.. ప్రవాస భారతీయుల హోమాలు

-

బ్రిటన్‌లో ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మధ్య పోటీ రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఈ రేసులో సునాక్‌ కంటే ట్రస్‌ కాస్త ముందంజలో ఉన్నట్లు సర్వేలు, మీడియా కథనాలు పేర్కొంటున్నారు. దీంతో యూకేలోని ప్రవాస భారతీయులు సునాక్‌కు మద్దతుగా ముందుకొచ్చారు. ఆయన గెలవాలని హోమాలు చేస్తున్నారు.

‘‘సునాక్ భారతీయుడని మేం ఈ హోమాలు, పూజలు చేయట్లేదు. ఆయన ప్రధాని పదవికి అత్యంత సమర్థులు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించేది ఆయనే అని నమ్ముతున్నాం’’ అని బ్రిటిష్‌ ఇండియన్‌ ఒకరు అంతర్జాతీయ మీడియాతో అన్నారు.

యూకేలో ఉన్న మైనార్టీల్లో అత్యధికులు ప్రవాస భారతీయులే. అధికారిక గణాంకాల ప్రకారం.. బ్రిటన్‌లో దాదాపు 15లక్షల మంది భారత సంతతికి చెందిన వారున్నారు. దేశంలో మొత్తం జనాభాలో వీరి సంఖ్య 2.5శాతంగా ఉంది.

ఇదిలా ఉండగా.. ప్రధాని రేసులో రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన సర్వేల ప్రకారం సునాక్‌ కంటే ట్రస్‌ రెండంకెల మెజార్టీలో ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల్లో సునాక్‌కు అధిక మద్దతు ఉన్నప్పటికీ.. టోరీల్లో ఎక్కువ మంది ట్రస్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ టీవీ డిబేట్‌లో అనూహ్యంగా ట్రస్‌పై సునాక్‌ విజయం సాధించడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందని ట్రస్‌ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version