జగన్ ను పంపించే సమయం వచ్చేసింది : పవన్‌

-

పవన్‌ వారాహి విజయ యాత్ర నాల్గవ విడుత నేడు చివరి రోజుకు చేరుకుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉత్తేజపూరితంగా ప్రసంగం చేశారు. వైసీపీ నేతల దృష్టిలో ఎవరూ ఎవరినీ పొగడకూడదని, అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడు అయినా ఈ వైసీపీ నేతలు అతడిని తిడతారని పవన్ వెల్లడించారు. వైసీపీ నేతలు ఆఖరికి రజనీకాంత్ ను కూడా వదల్లేదని, ఆయనను కూడా తిట్టారని పవన్ వివరించారు.

జగన్ ను పంపించే సమయం వచ్చేసిందని, ఇక జగన్ కు టాటా చెప్పేద్దాం అని పిలుపునిచ్చారు. సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని, లేకపోతో బాధ్యతగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. ఏదేమైనా ప్రజల కోసం నిలబడడం పక్కా అని పేర్కొన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, స్కూళ్లు మూతపడిపోతున్నాయని, వలసలు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే తన ప్రాణం పోయేంత వరకు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల కోసం పనిచేయాలని అని కోరుకుంటున్నానని తెలిపారు. అందరం కలిసి వెళతామనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.

ఇక, తానేమీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదని, ఇంకో రూ.10 వేలు ఎక్కువ ఇవ్వాలని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకునే వ్యక్తినని వివరించారు. జగన్… సంక్షేమ పథకాలకు ఇచ్చేది మీ డబ్బే… ఆయన తన జేబు నుంచి ఇవ్వడంలేదని ఆరోపించారు. సంపద సృష్టించకుండా కేవలం పథకాలు మాత్రమే ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version