తల్లి కావడం ప్రతి స్త్రీకి ఒక అద్భుతమైన అనుభవం. కానీ మొదటి ప్రసవం సిజేరియన్ (సి-సెక్షన్) అయినప్పుడు, రెండో గర్భం విషయంలో ఎన్నో భయాలు, సందేహాలు వస్తుంటాయి. ఇద్దరు పిల్లల మధ్య ఎంత సమయం ఖాళీ ఉండాలి? రెండోసారి నార్మల్ డెలివరీ సాధ్యమేనా? గ్యాప్ ఇవ్వకపోతే ఎలాంటి సమస్యలొస్తాయి? అనే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు, నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇద్దరు పిల్లల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?: సిజేరియన్ తర్వాత రెండోసారి గర్భం దాల్చడానికి కనీసం 18 నుండి 24 నెలల (ఒకటిన్నర నుంచి రెండేళ్ల) విరామం ఉండటం అత్యంత శ్రేయస్కరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం కూడా రెండేళ్లు ఆగడం చాలా మంచిది. ఇక సిజేరియన్ జరిగిన 6 నెలల్లోపే మళ్లీ గర్భం దాల్చితే తల్లి, బిడ్డ ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గ్యాప్ లేకపోతే తల్లికి వచ్చే ముప్పు: సరైన విరామం ఇవ్వకపోతే పాత కుట్ల భాగంపై ఒత్తిడి పడి గర్భాశయం చిట్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మాయ గర్భాశయ ముఖద్వారానికి అడ్డం పడటం, కుట్లకు బలంగా అతుక్కుపోవడం, రక్తహీనత రావడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ఇక ఫలితంగా రెండోసారి కూడా తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.

శిశువుపై పడే ఆరోగ్య ప్రభావం: తల్లి శరీరానికి తగినంత సమయం ఇవ్వకపోతే కడుపులోని బిడ్డపై కూడా ప్రభావం పడుతుంది. ఇక నెలలు నిండకుండానే ప్రసవం కావడం, పుట్టినప్పుడు పాపాయి తక్కువ బరువు ఉండటం మరియు బిడ్డ ఎదుగుదల మందగించడం లాంటి నవజాత శిశు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ సాధ్యమేనా?: మొదటి డెలివరీ ఆపరేషన్ అయినా, రెండోసారి నార్మల్ డెలివరీ (VBAC) అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది మహిళ శారీరక పరిస్థితి, పాత కుట్ల బలం పై ఆధారపడి ఉంటుంది. ప్లాన్ చేసుకునే ముందే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుని డాక్టర్ సలహా తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ సక్సెస్ రేటు పెరుగుతుంది.
తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలంటే సిజేరియన్ తర్వాత సరైన సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. ముందస్తు ప్రణాళిక, సరైన జాగ్రత్తలతో రెండో ప్రసవాన్ని కూడా ఎంతో సురక్షితంగా, ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు.
గమనిక: ఒకవేళ అనుకోకుండా ముందే గర్భం దాల్చినా కంగారు పడాల్సిన పనిలేదు. వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించి, క్రమం తప్పకుండా స్కాన్లు మరియు వైద్య పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి.
