డీకేపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహం… ట్రాక్ మారుతోందా

-

కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్‌ లో వివాదాలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు సీఎం సిద్ధరామయ్య లక్ష్యంగా వివాదం నడిచింది.కానీ డిప్యూటీ సీఎం శివకుమార్ పై మొదటి నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. బీజేపీలోకి వెళ్తున్నారనే టాక్ నడిచింది మొదట్లో. అలాంటి వివాదాలు వెంటాడుతూనే ఉన్నా శివకుమార్ మాత్రం తనదైన శైలిలో పనిచేసుకుంటు పోతున్నారు. ఇప్పుడు మరో వివాదం శివకుమార్ ని చుట్టుముట్టింది.ఈ నేపథ్యంలో అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ముడా ఇంటి స్థలాల వివాదంలో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై పార్టీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య, శివకుమార్‌ ఆగస్టు మూడోవారంలో ఢిల్లీ వెళ్లారు. అదే సందర్భంలో శివకుమార్‌ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిపై వివాదం కొనసాగుతున్న సమయంలో ప్రధానమంత్రిని డీకే కలవడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రధానిని కలిసేందుకు సొంత పార్టీ ముఖ్యమంత్రులకే అవకాశం లభించడం కష్టంగా ఉందని, అటువంటిది ప్రత్యర్థి పార్టీ నేత అయిన శివకుమార్‌ ఏ విధంగా అపాయింట్‌మెంట్‌ పొందారనే విషయంపై అధిష్ఠానం ఆరా తీసినట్టు తెలుస్తోంది.దీంతో ఆయనపై అధిష్టానం ఓ కన్నేసినట్టు టాక్ నడుస్తోంది.ఆయన కదలికపై ఎప్పటికప్పుడు అరా తీస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు, సీఎం ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి ప్రధానిని కలవడం వెనుక ఉద్దేశమేమిటని అధిష్ఠానం ఆరా తీసినట్టు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రిగా పలు అభివృద్ధి పనులపై ప్రధానిని కలిశానని, రాజకీయ ఉద్దేశం లేదని డీకే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో శివకుమార్‌ కూడా అమెరికా చేరుకున్నారు. వారిద్దరూ అక్కడ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.ఆ ఇరువురి భేటీ అసలు రహస్యం ఏంటని రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version