తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే : రాహుల్‌ గాంధీ

-

 

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఇవాళ హైదరాబాదులోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 6 ప్రధాన హామీలను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నారు.

ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలతో పోరాడుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నింటితోనూ పోరాడుతోందని వెల్లడించారు. రాజకీయాల్లో మనం ఎవరిపై పోరాడుతున్నామో మనకు తెలిసుండాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పార్టీలుగా చూస్తే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వేర్వేరుగానే కనిపిస్తాయి… కానీ, ఇవన్నీ కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. లోక్ సభలో కేంద్రం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ పై బీజేపీ ఎలాంటి కేసులు పెట్టదని, ఎంఐఎం నాయకులపైనా ఎలాంటి కేసులు ఉండవని వివరించారు. కేసీఆర్, ఎంఐఎం నేతలను మోదీ తన సొంత మనుషుల్లా భావిస్తారు కాబట్టే వారిపై కేసులు ఉండవని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా సీబీఐ ఇటువైపు తొంగిచూడదని వ్యాఖ్యానించారు.

 

ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సోనియాగాంధీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సోనియా ఏం చెబుతారో అది చేసి తీరతారని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరడం ఖాయమని, మరో 100 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిపోతుందని, బీజేపీ, ఎంఐఎం ఎంత ప్రయత్నించినా దీన్ని అడ్డుకోలేవని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిశ్చయించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version