ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో అక్రమ ప్రయాణాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని సవరిస్తూ ‘జన్ విశ్వాస్ చట్టం, 2026’ను తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ జూన్ 20, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఇకపై రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
వితౌట్ టికెట్ జరిమానా డబుల్: ఇప్పటివరకు రైల్లో టికెట్ లేకుండా పట్టుబడితే కనీస జరిమానా రూ.250 గా ఉండేది. కానీ ఇప్పుడా ఫైన్ను రూ.500 కు పెంచారు. టికెట్ లేకుండా ప్రయాణించినా లేదా అనుమతించిన దూరం కంటే ఎక్కువ దూరం వెళ్లినా.. టికెట్ ఛార్జీతో పాటు ఈ రూ.500 ఫైన్ కట్టాలి. ఇక ఒకవేళ జరిమానా కట్టడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మహిళల కోచ్లో వెళ్తే రూ.2,500 ఫైన్: రైల్లో మహిళల భద్రతకు రైల్వే శాఖ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. లేడీస్ రిజర్వ్ కోచ్లోకి పురుషులు ప్రవేశిస్తే ఏకంగా రూ.2,500 జరిమానా విధిస్తారు. అలాగే, జనరల్ టికెట్ వేసుకుని రిజర్వేషన్ కోచ్లలోకి దూరితే రూ.2,000 ఫైన్ పడుతుంది. ఇక వేరొకరి సీటు లేదా బెర్తును ఆక్రమించి, ఖాళీ చేయమంటే వినని వారికి రూ.1,000 జరిమానా విధిస్తారు.
స్టేషన్ ప్రాంగణంలోనూ కఠిన నియమాలు: కేవలం రైళ్లలోనే కాదు.. రైల్వే స్టేషన్లలోనూ రూల్స్ కఠినతరం చేశారు. ప్లాట్ఫాంలపై అనధికారికంగా తినుబండారాలు అమ్మేవారికి, భిక్షాటన చేసేవారికి రూ.2,000 ఫైన్ వేస్తారు. ఇక అలాగే టికెట్ లేకుండా లేదా సరైన కారణం లేకుండా రైల్వే ప్రాంగణంలోకి ప్రవేశిస్తే రూ.500 జరిమానా ఉంటుంది. రైల్వే సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే రూ.1,000 నుండి రూ.2,000 వరకు వసూలు చేస్తారు.
అక్కడికక్కడే ఫైన్ వసూలు: ఈ కొత్త చట్టం ప్రకారం రైల్వే రక్షక దళం (RPF) సిబ్బందికి జరిమానాలు వసూలు చేసే పూర్తి అధికారం కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి RPF పోలీసులు అక్కడికక్కడే ఫైన్ వసూలు చేసి రసీదు ఇస్తారు. ఇక కాజీపేటతో పాటు దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో అధికారులు ఈ కొత్త నియమాలపై పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
రైల్వే స్టేషన్లలో మరియు రైళ్లలో పరిశుభ్రత, భద్రతను పెంచడంతో పాటు అక్రమ ప్రయాణాలను తగ్గించడానికే ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. ఈ నిబంధనలన్నీ సామాన్య ప్రయాణికుల సౌకర్యం కోసమేనని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రయాణికులు బాధ్యతగా సరైన టికెట్ కొనుగోలు చేసి, ప్రయాణ నియమాలను పాటించడం ఎంతో శ్రేయస్కరం.
గమనిక: మీరు ప్రయాణించేటప్పుడు ఎల్లప్పుడూ మీ స్వంత టికెట్ను దగ్గర ఉంచుకోండి. రైలు ఎక్కేటప్పుడు అది మీరు ప్రయాణించాల్సిన కోచ్ అవునో కాదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది.
