సరస్వతీ నది పుష్కరాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మంగళవారం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతీ నది పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సమీక్ష నిర్వహించారు. మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సారథ్యంలో హైదరాబాద్లోని మంత్రి సురేఖ కార్యాలయంలో దేవాదాయ, పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ పోర్టు తదితర శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ విభాగ హెడ్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
పుష్కరాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు, శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లపై చర్చ నిర్వహించారు. కాళేశ్వరం ఒక్క చోటనే సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతుండటంతో అన్ని రాష్ట్రాల నుంచి రోజుకు లక్షన్నరకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని మంతులు సురేఖ, శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.