సకల హంగులతో ఆసియాలోనే అతి పెద్ద కోహెడ మార్కెట్‌ : నిరంజన్‌ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వం కీల‌క ప్రక‌ట‌న చేసింది. ఈ మేర‌కు వెండార్స్ కు తీపి క‌బురు చెప్పింది. ఆసియా లోనే అతి పెద్ద మార్కెట్ ను ఏర్పాటు చేయ‌నున్నట్లు వెల్ల‌డించింది. బుధ‌వారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి నివాసంలో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసింది. బాట సింగారం, ప‌హాడీ ష‌రీఫ్ పండ్ల మార్కెట్ ల‌లో ఏర్పాటు చేయ‌నున్న సౌక‌ర్యాల‌పై చ‌ర్చించారు. సకల హంగులతో ఆసియాలోనే అతి పెద్ద కోహెడ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తునట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కోహెడ మార్కెట్‌లో వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దాదాపు 199 ఎకరాల్లో నిర్మించనున్న ఈ మార్కెట్ నిర్మాణం కోసం రూ. 403 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తునట్టు మంత్రి పేర్కొన్నారు.

ఇందులో 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్లు అందరికీ దుకాణాలు, 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణంతో పాటు 11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్ వంటి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. రాకపోకలు సాగించేందుకు వీలుగా 56.54 ఎకరాల్లో రహదారులు నిర్మాణంతో పాటు 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తునట్టు మంత్రి తెలిపారు. మార్కెట్ నిర్మాణ ప్రణాళిక ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.ఈ సమీక్షలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలాలు కోహెడ మార్కెట్ ప్రణాళికను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version