ప్రతి చిన్న విషయానికి స్మార్ట్ఫోన్ వాడటం, గంటల తరబడి చాటింగ్ లేదా స్క్రోలింగ్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే అతిగా ఫోన్ వాడటం వల్ల బొటనవేలు నొప్పితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైద్యులు దీనిని ‘టెక్స్టింగ్ థంబ్’ అని పిలుస్తారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దాని వల్ల వచ్చే తీవ్రమైన నష్టాలేంటి? ఈ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏంటీ ‘టెక్స్టింగ్ థంబ్’?: ఫోన్లో ఆపకుండా టైపింగ్ చేయడం, నిరంతరం స్క్రోల్ చేయడం వల్ల బొటనవేలిలోని కండరాలు, స్నాయువులు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీనికారణంగా బొటనవేలు కదలికల్లో నొప్పి, బిగుతుతనం, కీళ్ల వద్ద వాపు, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ‘టెక్స్టింగ్ థంబ్’ లేదా ‘ట్రిగ్గర్ థంబ్’ అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కార్పల్ టనల్ సిండ్రోమ్, థంబ్ ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన కీళ్ల సమస్యలకు దారితీయవచ్చు.
తగ్గించుకునే మార్గాలు ఇవే: విరామం తప్పనిసరి ప్రతి 20 నుండి 30 నిమిషాల ఫోన్ వాడకం తర్వాత కాసేపు ఫోన్ పక్కన పెట్టి చేతికి విశ్రాంతినివ్వాలి.
స్ట్రెచింగ్ చేయండి: ఇక బొటనవేళ్లను, చేతి వేళ్లను మెల్లగా వంచుతూ, చాపుతూ చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది.

మార్చండి అలవాటు: ఇక కేవలం ఒక చేతి బొటనవేలితోనే కాకుండా, రెండు చేతులను వాడటం లేదా చూపుడు వేలుతో స్క్రోల్ చేయడం అలవాటు చేసుకోండి.
స్మార్ట్ ఫీచర్లు వాడండి: టైపింగ్ కష్ట తగ్గించుకోవడానికి ఫోన్లోని ‘వాయిస్ టు టెక్స్ట్’ ఫీచర్ను ఉపయోగించవచ్చు.
సరైన పొజిషన్: ఇక ఫోన్ను ముఖం ఎదురుగా పట్టుకుని, తల వంచకుండా చూడటం మెడ, చేతులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ‘థంబ్ బ్రేస్’ వాడటం మంచిది.
ఇక “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు ఏ విషయంలోనైనా అతి చేయడం మంచిది కాదు. స్మార్ట్ఫోన్ వాడకంలో కూడా ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. నొప్పి ప్రారంభమైనప్పుడే ఫోన్ వాడకం తగ్గించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే థంబ్ పెయిన్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
గమనిక: బొటనవేలి నొప్పి తీవ్రంగా ఉండి, వేలు కదపడం కూడా కష్టంగా మారితే మాత్రం సొంత వైద్యం చేసుకోకుండా ఆర్థోపెడిక్ (కీళ్ల నిపుణులు) వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరం.
