పిల్లలను పెంచడం అనేది పెద్ద బాధ్యత మాత్రమే కాదు, అదొక గొప్ప కళ. ఈ రోజుల్లో పిల్లలు మన మాట వినాలన్నా, మనతో స్నేహంగా ఉండాలన్నా కేవలం కోపాలు, శిక్షలు పనిచేయవు. మరీ గారాబం చేయకుండా, అలా అని మరీ కఠినంగా ఉండకుండా పిల్లలను సరైన మార్గంలో పెట్టడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. పిల్లల పసి మనసును అర్థం చేసుకుంటూ, వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గొడవలకు దూరంగా ఉండండి: పిల్లలు తల్లిదండ్రులనే చూసి ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. అందుకే వారి ముందు గొడవపడటం, అరుచుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇక ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే పిల్లల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
హింస వద్దు.. ప్రేమే ముఖ్యం: పిల్లలు తప్పు చేసినప్పుడు కొట్టడం, తిట్టడం వల్ల వారు మరింత మొండిగా మారతారు. శారీరక శిక్షలు లేకుండా, ఏది మంచి ఏది చెడో శాంతంగా వివరించి చెప్పాలి. కోపం కంటే ప్రేమతో చెప్పే మాటలే వారి మనసుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

సొంతంగా చేసుకునేలా ప్రోత్సహించండి: హోమ్వర్క్ చేయడం, బట్టలు సర్దుకోవడం, ఫ్రెండ్స్ను చేసుకోవడం వంటి చిన్న చిన్న పనులను పిల్లలకే వదిలేయాలి. ఇక అన్నింటికీ మనమే సహాయం చేయకుండా, వారి పనులు వారు సొంతంగా చేసుకునేలా ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కొంత సమయం కేటాయించండి: ఉద్యోగాల వల్ల ఎంత బిజీగా ఉన్నా, రోజులో కొంత సమయం పిల్లల కోసం కేటాయించడం చాలా ముఖ్యం. ఇక వారితో మాట్లాడటం, కలిసి బయటకు వెళ్లడం వల్ల మీ మధ్య బంధం బలపడుతుంది. అలాగే తప్పు చేస్తే ‘సారీ’ చెప్పే మంచి అలవాటును వారికి నేర్పించాలి.
ఇతరుల ముందు తక్కువ చేయకండి: పిల్లలను ఇతరుల ముందు అవమానించడం లేదా తక్కువ చేసి మాట్లాడటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇక ఏవైనా లోపాలు ఉంటే నలుగురిలో కాకుండా విడిగా పిలిచి, ఆప్యాయంగా అర్థమయ్యేలా చెప్పడం చాలా మంచిది.
పిల్లలను సరైన దారిలో పెట్టడానికి ప్రేమ, సహనం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. వారిని కేవలం పిల్లలారా కాకుండా ఒక మంచి ఫ్రెండ్లా చూస్తే, వారు మీ మాట వినడమే కాకుండా మీతో ప్రతి విషయాన్నీ ఓపెన్గా పంచుకుంటారు.
గమనిక: ప్రతి మనిషి స్వభావం వేరుగా ఉన్నట్లే, ప్రతి చిన్నారి ఆలోచనా విధానం కూడా వేరుగా ఉంటుంది. పిల్లల మనస్తత్వాన్ని బట్టి తల్లిదండ్రులు ఓపికతో వ్యవహరిస్తూ, అవసరమైతే చైల్డ్ సైకాలజిస్ట్ సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
