ఉత్తమ్, కోమటిరెడ్డి అనుకుంటే ప్రభుత్వం టక్కున పడిపోతుంది: అర్వింద్

-

ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అర్వింద్ కుమార్ అన్నారు. ముఖ్యంగా హస్తం పార్టీలో ఉన్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అనుకుంటే ప్రభుత్వం టక్కున పడిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేసుకుంటారని విమర్శించారు. లోక్సభ ఎన్నికలు కాగానే ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందన్న అర్వింద్.. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పడిపోతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో వేల్పూరులో అర్వింద్‌ రోడ్ షో నిర్వహించారు.

“రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యం. తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను కాంగ్రెస్ మోసగించింది. ఐదేళ్లలో ఎంపీగా నాపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత ఇప్పుడు జైలులో ఉన్నారు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్ప తప్పు చేయను. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొచ్చాను. రాష్ట్రం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ ఏడాదిలోపు తెరుచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందున మన పనులు కావట్లేదు. ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారు.” అని అర్వింద్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version