‘గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్’ కు గుడ్ న్యూస్. ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలని కార్మిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
గిగ్ వర్కర్ల భద్రతపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేలా బిల్లు ఉండాలని కార్మిక శాఖను ఆదేశించారు. బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టాలని.. ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. ఈ సూచనలను తీసుకొని, వాటిని పరిశీలించి తుది ముసాయిదాను రూపొందించాలని.. గిగ్వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని.. చెప్పారు. కంపెనీలు, అగ్రిగేటర్లను సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని సూచించిన సీఎం రేవంత్.. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు.