భాగ్యనగర సిగలో మరో కలికితురాయి చేరింది. హైదరాబాద్ మహానగరానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా వ్యాన్గార్డు సంస్థ ప్రకటించింది. దేశంలోనే తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లోనే స్థాపించనున్నట్లు తెలిపింది. వ్యాన్ గార్డు కంపెనీ ప్రతినిధులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే.. 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. దీని ద్వారా ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్ నిపుణులకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. తాజాగా ఏర్పాటు చేస్తున్న సెంటర్ తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా వ్యాన్ గార్డ్ సీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే హైదరాబాద్ను ఎంచుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో అన్ని రంగాల నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ను గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్గా చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.