విశాఖ ఉక్కు కొంటానని KCR పదిమందిలో రాష్ట్ర పరువు తీశాడు – వైఎస్ షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పై మరోచారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖ ఉక్కు పరిశ్రమని కొంటానని కేసీఆర్ పదిమందిలో తెలంగాణ రాష్ట్ర పరువు తీశాడని మండిపడ్డారు. “అనువుగాని చోట అధికులమన రాదు” అనే సామెత పగటెచ్చుల దొర కెసిఆర్ కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు.

తినడానికి తిండి లేదు కానీ సోకులకు లోటా అన్నట్లు విశాఖ ఉక్కు కొంటానని,ఇప్పుడు పది మందిలో రాష్ట్ర పరువు తీశాడన్నారు. గొప్పలకు పోయి బొక్కబోర్లపడ్డడని.. కపట ప్రేమలు కురిపించి, హెచ్చులకు పోయి నవ్వుల పాలయ్యాడని అన్నారు. బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ అనిపించుకున్నాడు. అయినా అడ్డంపొడుగు మాటలతో జనాలను ఫూల్స్ చేయడం దొరకు వెన్నతో పెట్టిన విద్య అంటూ దుయ్యబట్టారు షర్మిల.

దొరా నీవు తెలంగాణ బిడ్డవే అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే నీకు ముఖ్యం అనుకుంటే… గతంలో హామీ ఇచ్చినట్లుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించు, 100 రోజుల్లో నిజాం షుగర్స్ తెరిపిస్తా అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకో, మూతపడిన వందలాది ఫ్యాక్టరీలను తెరిపించు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టు, రోడ్డున పడ్డ లక్షలాది కార్మికులను ఆదుకో.. నీ నీచ రాజకీయాల కోసం ప్రతీసారి రాష్ట్ర పరువును పణంగా పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అంటూ హెచ్చరించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version