ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు చేసిందని తెలంగాణ సర్కార్. అయితే.. దీనిపై KTR స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అంటూ ఫైర్ అయ్యారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టిందని మండిపడ్డారు.
ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్ లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదని అల్టిమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోందని తెలిపారు. విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన ఇటీవలి సంఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని వెల్లడించారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయం. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.