సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి రూ.50 కోట్లు ఖర్చు పెట్టాలి.. జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!

-

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న అనంతరం మీడియా చిట్ చాట్ లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే సీటుకి 50 కోట్లు ఖర్చు పెట్టాలని.. అదే పటాన్ చెరువు ఎమ్మెల్యే సీటుకి 100 కోట్లు ఖర్చు పెట్టాలని అన్నారు. ప్రస్తుతం కులాలతో రాజకీయం నడవట్లేదని.. ఇప్పుడు రాజకీయమంతా పైసలతోనే నడుస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక పీసీసీ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు జగ్గారెడ్డి. ప్రస్తుత ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పిసిసి బీసీ నేతకు ఇచ్చారని.. తను కూడా ఏదో ఒక రోజు పిసిసి అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపిలో ప్రెసిడెంట్ అవ్వాలంటే కుదరదు అన్నారు జగ్గారెడ్డి. ఆ పార్టీలో ఎప్పుడు పదవి వస్తుందో.. ఎప్పుడు పోతుందో వారికే తెలియదని విమర్శించారు. ఇక నేడు వినయకచవితి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version