త్వరలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తాం.. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త చరిత్ర రాయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు మంత్రి దామోదర, నాయకులు కడిగారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున మంత్రి ఆర్ధిక సహాయం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయని అన్నారు. హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందని, జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని వెల్లడించారు. ఎన్ని తరాలైనా అమరుల రుణం తీర్చుకోలేనిదన్నారు. హక్కుల కోసం జరిగే పోరాటాలకు రాజకీయ రంగు పూయకూడదని, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.