ఈనెల 16న హైదరాబాద్​లో వైన్ షాపులు బంద్

-

ఆషాఢమాసం ఆఖరి వారం లాల్ దర్వాజ బోనాలు కనువిందుగా సాగనున్నాయి. ఏటా వేలాది మంది భక్తులు లాల్ దర్వాజలోని ‘సింహవాహిని మహంకాళి’ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చేటి తల్లిగా ఆ అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ప్రకృతి సంబంధంగా బోనాల సమర్పిస్తూ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆదివారంతో బోనాల పండుగ ముగియనుంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌ నగరంలో వైన్ షాపులు మూసివేయాలని పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌(మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు), ఎల్బీనగర్‌ జోన్‌ (వనస్థలిపురం డివిజన్‌), మహేశ్వరం జోన్‌(మహేశ్వరం డివిజన్‌) పరిధిలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఆదేశించారు. సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని సౌత్‌జోన్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ డివిజన్‌ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ ఆంక్షలు ఆదివారం అమల్లో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version