శక్తి పీఠంగా నిలిచిన ప్రయాగరాజ్ లలితా దేవి ఆలయ వైభవం..

-

పవిత్ర గంగా యమునా మరియు అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ క్షేత్రమైన ప్రయాగరాజ్. దైవిక శక్తుల నిలయం. ఈ పుణ్యభూమిలో వెలసిన శ్రీ లలితా దేవి శక్తి పీఠం అద్భుతమైన చరిత్ర, విశేషమైన శక్తితో అలరారుతోంది. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది త్రివేణి సంగమ పవిత్రతకు సాక్ష్యంగా నిలిచే ఒక జీవన కేంద్రం. ఇక్కడి లలితా దేవి ఆలయం నవరాత్రి సమయానికైతే భక్తుల రద్దీతో నిండిపోతుంది. శక్తి ఆరాధనలో ఈ ఆలయం విశిష్ట స్థానం సంపాదించింది. ఇక్కడకు వచ్చే భక్తులు దేవి కృపతో అన్ని కష్టాలను దూరం చేసుకుంటారని నమ్మకం.మరి ఈ ఆలయ విశిష్టతను,పురాణకథను తెలుసుకుందాం..

ఆలయ పురాణం: సతీ దేవి దివ్య స్పర్శ, హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన కథలలో ఒకటైన సతీ దేవి ఆత్మాహుతితో ఈ ఆలయ చరిత్ర ముడిపడి ఉంది. తండ్రి దక్షుడు తన భర్త పరమేశ్వరుడిని అవమానించడంతో సహించలేక సతీ దేవి అగ్నిగుండంలోకి దూకి ఆత్మార్పణం చేసుకుంది. అప్పుడు శివుడు తీవ్రమైన దుఃఖంతో సతీ దేవి దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. ఆ విశ్వ విధ్వంసాన్ని ఆపడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రం ఉపయోగించి సతీ దేవి దేహాన్ని 51 భాగాలుగా ఖండించాడు.

ఆ దేహ భాగాలు పడిన పవిత్ర స్థలాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. పురాణాల ప్రకారం సతీ దేవి కుడి చేతి వేళ్లు (కుడి హస్తంలోని అంగుళీభూషణం) ప్రయాగరాజ్ నగరంలోని మీరాపూర్ ప్రాంతంలో పడ్డాయని నమ్మకం. ఈ పవిత్ర స్థలమే నేటి లలితా దేవి శక్తి పీఠం. అందుకే ఇక్కడ అమ్మవారు తన భక్తులను రక్షించి ఆశీర్వదించే దివ్య హస్తం రూపంలో కొలువై ఉందని విశ్వసిస్తారు.

The Divine Glory of Prayagraj Lalita Devi Shakti Peeth
The Divine Glory of Prayagraj Lalita Devi Shakti Peeth

ప్రత్యేకత మరియు విశిష్టత: త్రివేణి సంగమానికి సమీపంలో యమునా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మి, మహాకాళి సరస్వతి అనే మూడు రూపాలలో పూజిస్తారు. ఆలయంలోని మూడు పీఠాలు ఈ త్రిశక్తి స్వరూపాన్ని సూచిస్తాయి. ఈ ఆలయాన్ని పూర్వకాలంలో మహర్షి భరద్వాజుడు ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామచంద్రుడు మరియు పాండవులు కూడా వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం నిర్మాణం శ్రీ యంత్రం నమూనా ఆధారంగా రూపొందించబడింది. అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో శ్రీ విద్యోపాసనకు (తంత్ర సాధనకు) అత్యంత ముఖ్యమైన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ పీఠాన్ని దర్శిస్తే భోగము (లౌకిక సుఖాలు) మోక్షము రెండూ లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ సంవత్సరం నవరాత్రుల పూజ విశేషాలు: నవరాత్రులు అంటే లలితా దేవి ఆలయం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రూపాలలో విశేష పూజలు అలంకరణలు నిర్వహిస్తారు. నవరాత్రి రోజుల్లో ఆలయ ప్రాంతం మొత్తం జాతర వాతావరణాన్ని తలపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. ప్రతి రోజు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణలు చేస్తారు. ముఖ్యంగా నవరాత్రి ఐదవ రోజున లలితా పంచమి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.నవరాత్రులలో శ్రీ విద్యా హోమం మరియు శత చండీ యజ్ఞం వంటి శక్తివంతమైన యజ్ఞాలు నిర్వహిస్తారు. ఈ ఆచారాలు జీవితంలోని అడ్డంకులు తొలగి, ధైర్యం, విజయం మరియు ఆనందాన్ని ప్రసాదిస్తాయని నమ్మకం.

ఈ రోజుల్లో అమ్మవారికి పంచమేవ (ఐదు రకాల ఎండు ఫలాలు), పాయసం (ఖీర్), శెనగలు (చనా) వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.

ప్రయాగరాజ్‌లోని లలితా దేవి శక్తి పీఠం భక్తి, చరిత్ర మరియు దైవిక శక్తికి ఒక ఆకర్షణీయమైన సంగమం. త్రివేణి సంగమ పవిత్రతను తనలో ఇముడ్చుకున్న ఈ ఆలయం సతీ దేవి దివ్య స్పర్శతో యుగయుగాలుగా భక్తులకు అభయాన్ని ఆశీర్వాదాలను అందిస్తోంది. ఈ శక్తిపీఠాన్ని దర్శించడం నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news