హిందూ సంప్రదాయంలో చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని జ్ఞానానికి, వివేకానికి, పవిత్రతకు అధిష్టాన దేవతగా పూజిస్తాం. పుస్తకాలు, గ్రంథాలు మరియు విద్యను అందిచే ప్రతీ వస్తువును మనం దైవ స్వరూపంగా భావిస్తాం. అయితే, సకల విద్యలను ప్రసాదించే ఆ చదువుల తల్లి వాహనంగా ‘హంస’ ఎందుకు ఉంటుంది? జ్ఞానానికి, హంసకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం మరియు శాస్త్రాలు చెబుతున్న అంతరార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచిని గ్రహించే వివేకానికి సంకేతం: పాలల్లో నీళ్లు కలిపి హంస ముందు ఉంచితే, అది నీటిని వదిలేసి కేవలం పాలను మాత్రమే గ్రహిస్తుందని ప్రతీకగా చెబుతారు. లోకంలో ప్రతి విషయంలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. జ్ఞాని అయినవాడు చెడును విడిచిపెట్టి, కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలనే సందేశాన్ని హంస వాహనం మనకు అందిస్తుంది. అటువంటి సత్యజ్ఞానాన్ని పొందిన వారే సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.
హంస జపం – ‘సోహం’ తత్వం: ఆధ్యాత్మికంగా హంస అంటే మన ఊపిరి (శ్వాస). మనం గాలిని బయటకు వదిలినప్పుడు “సః” అనే శబ్దం, లోపలికి పీల్చినప్పుడు “అహం” అనే శబ్దం వెలువడతాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రక్రియనే ‘హంస జపం’ అంటారు.

సః అంటే ఆ పరమాత్మ,అహం అంటే జీవాత్మ (నేను):ఈ శ్వాస నిరంతరం సాగుతూ “అహం సః.. సోహం” (ఆ పరమాత్మే నేను) అనే పరమ సత్యాన్ని బోధిస్తుంది. జీవాత్మ, పరమాత్మ ఒకటే అని తెలుసుకోవడమే అసలైన విద్య. అందుకే ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి హంసను తన వాహనంగా చేసుకుంది.
ఇక ‘సరస్వతి’ అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ సారాన్ని (నేను అనే భావాన్ని) పూర్తిగా తెలుసుకునే శక్తిని ఇచ్చే దేవత. విద్యార్థులు మరియు జ్ఞానాన్ని కోరుకునేవారు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, హంస లాగా మంచి చెడులను వేరు చేసి చూసే వివేకాన్ని, క్రమశిక్షణను అలవర్చుకున్నప్పుడే అమ్మవారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం హిందూ పురాణాలు, వేద శాస్త్రాలు మరియు సంప్రదాయ ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడింది.
