టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం.. భారత ప్రభుత్వం నిర్ణయం..

-

దేశభద్రతకు ముప్పు ఉందనే కారణంతో భారత ప్రభుత్వం చైనాకు చెందిన మొత్తం 267 వరకు యాప్‌లను నిషేధించింది. తొలి విడతలో 59 యాప్‌లను నిషేధించారు. తరువాత మిగిలిన యాప్‌లను నిషేధించారు. వీటిల్లో టిక్‌టాక్‌, వీచాట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. అయితే ఆయా యాప్‌లను నిషేధించిన అనంతరం వాటి నిర్వాహకుల నుంచి ప్రభుత్వం సమాధానాలు కోరింది.

కాగా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా యాప్‌ల యాజమాన్యాలు సమాధానాలిచ్చాయి. డేటా సేకరణ, వ్యక్తిగత భద్రత, గోప్యత వంటి అంశాలపై వారు సమాధానం ఇచ్చారు. కానీ ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవని కేంద్ర ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌ సహా మొత్తం 59 యాప్‌లను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. దీంతో టిక్‌టాక్‌, వీచాట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి యాప్‌లకు అన్ని దారులూ మూసుకుపోయాయి.

అయితే పబ్‌జి వంటి మిగిలిన యాప్‌లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పబ్‌జి కార్ప్‌ ఓ వైపు చైనా కంపెనీ టెన్సెంట్‌తో భాగస్వామ్యం రద్దు చేసుకుని పబ్‌జి ఇండియన్‌ వెర్షన్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. కానీ ఆ యాప్‌కు ఇంకా అనుమతి లభించలేదు. అయితే ప్రస్తుతం టిక్‌టాక్‌ సహా మొత్తం 59 యాప్‌లను శాశ్వతంగా నిషేధించడంతో పబ్‌జి ని కూడా శాశ్వతంగా నిషేధిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version