ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం.. 50 వేల ఉద్యోగులకు లేఆఫ్? అసలు కారణం ఇదే!

-

ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు కంపెనీ ‘ఫ్యూచర్ ప్లాన్ 2030’ పేరుతో ఒక పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏకంగా 50 వేల మందికి పైగా ఉద్యోగులను తీసివేసేందుకు సిద్ధమైంది. అసలు ఇంతటి ప్రముఖ కంపెనీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో వివరంగా తెలుసుకుందాం.

నష్టాల్లో గ్లోబల్ దిగ్గజం: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కంపెనీ లాభాలు గణనీయంగా పడిపోవడంతో సూపర్‌వైజరీ బోర్డు ‘ఫ్యూచర్ ప్లాన్ 2030’కి ఆమోదం తెలిపింది. ఇక సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు.

 

ఉద్యోగాలపై పెద్ద దెబ్బ: ఈ కొత్త వ్యూహంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నారు. పాత ప్లాన్లతో కలిపితే ఈ లేఆఫ్స్ సంఖ్య ఏకంగా లక్ష వరకు చేరే అవకాశం ఉంది. ఇక ఇందులో సాధారణ సిబ్బందితో పాటు మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఉన్నారు. జర్మనీలోని అనేక ప్లాంట్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అసలు కారణాలు ఇవే: చైనా మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కార్ల అమ్మకాలు 25 శాతానికి పైగా పడిపోయాయి. మరోవైపు అమెరికా విధిస్తున్న భారీ సుంకాల వల్ల ఏటా రూ.45 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. డిమాండ్ లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు కంపెనీకి కోలుకోలేని దెబ్బ తీశాయి.

ఉత్పత్తి తగ్గించి, ఖర్చు కోత: కంపెనీ మోడళ్లను, వేరియంట్లను సగానికి పైగా తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని భావిస్తోంది. అలాగే 2027 నుంచి 2031 మధ్య పరిశోధన, అభివృద్ధి (R&D) కోసం బిలియన్ల యూరోలను పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేస్తోంది.

కార్ల రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న వేళ, ఫోక్స్‌వ్యాగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల ప్రతినిధులు, ప్రభుత్వంతో చర్చించి తీసుకున్న ఈ కఠిన చర్యలు కంపెనీని మళ్లీ మునుపటి స్థితికి తీసుకువస్తాయో లేదో వేచి చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news