భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన గుజరాత్లోని సోమనాథ్ క్షేత్రానికి హిందూమతంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడిని అధిపతిగా కలిగిన వృషభ రాశి వారికి ఈ క్షేత్ర దర్శనం ఎంతో మేలు చేస్తుందని, జాతకంలోని గ్రహదోషాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. సాక్షాత్తు ఆ చంద్రుడే స్వయంగా ప్రతిష్టించిన ఈ దివ్యలింగం వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథ, విశేషాలు మీకోసం.
సోమనాథుడు అంటే ఎవరో తెలుసా?: జ్యోతిర్లింగాల అన్నింటిలోకి సోమనాథ జ్యోతిర్లింగం మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరాన కొలువై ఉంది. ఇక్కడ సోమనాథుడు అంటే ‘సోమ ప్రభువు’ అని అర్థం. ‘సోమ’ అంటే చంద్రుడు, ‘నాథ’ అంటే ప్రభువు. అంటే చంద్రుడికి ప్రభువైన శివుడే ఈ సోమనాథుడు. సమస్త సృష్టికి ఆ పరమశివుడే ఆధారమని ఈ ఆలయం మనకు గుర్తుచేస్తుంది.
దక్ష ప్రజాపతి శాపం.. వెలవెలబోయిన చంద్రుడు: పురాణాల ప్రకారం దక్షుడికి 27 మంది కుమార్తెలు ఉండేవారు. వారందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే చంద్రుడు తన భార్యలందరి కంటే ‘రోహిణి’పైనే ఎక్కువ ప్రేమ చూపించేవాడు. దీనితో మిగిలిన 26 మంది భార్యలు బాధపడి తండ్రికి ఫిర్యాదు చేశారు. చంద్రుడికి ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినకపోవడంతో కోపగించిన దక్షుడు.. చంద్రుని అందం, ప్రకాశం క్రమంగా క్షీణించిపోవాలని శపించాడు.

శాప విముక్తి కోసం ఘోర తపస్సు: తన మామ ఇచ్చిన శాపం వల్ల చంద్రుడి కాంతి తగ్గిపోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు చంద్రుడు గుజరాత్ సముద్ర తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించి, శాపం పోవాలని శివుని గురించి కఠోరమైన తపస్సు చేశాడు. చంద్రుని భక్తికి మెచ్చిన బోళాశంకరుడు ప్రత్యక్షమై అతనికి శాప విముక్తి కలిగించి అమరత్వాన్ని ప్రసాదించాడు.
పౌర్ణమి వెనుక దాగున్న రహస్యం: శాపాన్ని పూర్తిగా తొలగించడం వీలుపడదు కాబట్టి, శివుడు ఒక మార్గం చెప్పాడు. దాని ప్రకారమే ప్రతి 15 రోజులకు ఒకసారి చంద్రుడు క్షీణిస్తూ (అమావాస్య), ఆ తర్వాత మళ్లీ 15 రోజులకు తిరిగి ప్రకాశిస్తూ పౌర్ణమి రూపంలో వస్తాడు. ఇక తనను రక్షించినందుకు కృతజ్ఞతగా తాను పూజించిన లింగంలోనే ఉండిపోవాలని చంద్రుడు కోరగా.. శివుడు అంగీకరించి అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు.
గ్రహదోషాలు తొలగిపోతాయా?: ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని శివపురాణం చెబుతోంది. ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు చంద్రుడితో ప్రత్యేక సంబంధం ఉంటుంది కాబట్టి, వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే జాతకంలోని చంద్ర దోషాలు, మానసిక ఆందోళనలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇక శివుడితో పాటు పార్వతీదేవి ఆశీస్సులు కూడా భక్తులకు లభిస్తాయి.
సమస్త జీవరాశిని పోషించే ఆ పరమశివుడి మొదటి జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ చరిత్ర విన్నారుగా! చంద్రుడికే శాపవిముక్తి కలిగించిన ఈ స్వామిని దర్శించుకుంటే మన జీవితంలో ఉండే కష్టాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా లక్షలాది మంది భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకుని పునీతులవుతుంటారు.
గమనిక: పైన పేర్కొన్న కథ శివపురాణం మరియు స్కంద పురాణాల్లోని ఆధ్యాత్మిక గాథల ఆధారంగా అందించబడింది. జాతకంలో గ్రహ దోషాల నివారణకు సంబంధించిన పరిహారాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది.
