రూ.2 వేల కోసం గొడవ.. భర్త కళ్లలో యాసిడ్ పోసిన భార్య

-

ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంట ఓ రెండు వేల రూపాయల కోసం గొడవ పడింది. ఆ గొడవను భర్త మరిచిపోయాడు. కానీ అదే మనసులో పెట్టుకున్న భార్య అతడిపై కోపం పెంచుకుంది. ఆ కోపంలోనే పుట్టింటికి వెళ్లింది. అక్కడితో ఆగక భర్తపై హత్యకు కుట్ర పన్నింది. తన కుటుంబంతో కలిసి అతడిపై దాడి చేసి కళ్లలో యాసిడ్ పోసింది. ఈ దారుణ ఘటన బిహార్‌లోని షాబాజ్‌పుర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఈ దాడిలో కళ్లు కోల్పోయాడని వైద్యులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరహా గ్రామానికి చెందిన నాగేశ్వర్ సింగ్, షాబాజ్​పుర్​కు చెందిన పార్వతీ కుమారి.. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూ.2000 విషయంలో 15 రోజుల క్రితం భార్యాభర్తలకు గొడవ జరిగింది. కోపంతో షాబాజ్​పుర్​లోని పుట్టింటికి వెళ్లిపోయింది పార్వతి. మంగళవారం ఫోన్​ చేసి భర్తను తన స్వగ్రామానికి రావాలని కోరింది.

పార్వతి అమ్మానాన్నల ఇంటికి నాగేశ్వర్ వెళ్లగా.. అక్కడ గొడవ పెద్దదైంది. ఆమె కుటుంబసభ్యులంతా కలిసి నాగేశ్వర్​ను చితక్కొట్టారు. పార్వతి యాసిడ్​తో భర్త ముఖంపై దాడి చేసింది. వెంటనే అతడి కళ్లు కనిపించకుండా పోయాయి .సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన పార్వతి ఇంటికి వెళ్లారు. బాధితుడ్ని తొలుత స్థానిక ప్రాథమిక కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి సీతామఢీలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన కళ్లల్లో యాసిడ్ పోశారని నాగేశ్వర్ చెబుతున్నా.. అలాంటి ఆనవాళ్లు లేవని.. అతడికి చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version