తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిన వ్యవహారంలో మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మే 2వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఖేద్కర్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
అంతకుముందు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కచ్చితమైన విచారణ జరగలేదనని .. త్వరగా ఈ కేసు విచారణ ముగించాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖేద్కర్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని .. అయితే కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించిందని అన్నారు. కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ నమోదు చేసిన క్రిమినల్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.