కార్మికులు లేనిదే సమాజం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మేడే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందని చెప్పారు. ఆనాటి దోపిడి విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది అని కొనియాడారు.
కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పని చేస్తోందన్నారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని తమ ప్రభుత్వం నిలబెట్టిందని.. లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామన్నారు. త్వరలోనే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను తీసుకొస్తామన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.