పాన్ ఇండియా చిత్రాలపై అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తన నిజాయితీతో కూడిన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. బాలీవుడ్‌లోని పని విధానంపై అసంతృప్తితో హిందీ చిత్ర పరిశ్రమను వదిలిపెట్టిన అనురాగ్, తాజాగా ‘పాన్-ఇండియా’ సినిమాల ట్రెండ్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఇది సినీ పరిశ్రమను మోసం చేసే ‘ఒక భారీ స్కాం’ మాత్రమే. ‘ది హిందూ’ పత్రిక నిర్వహించిన ‘ది హడిల్’ కార్యక్రమంలో మాట్లాడిన అనురాగ్ కశ్యప్, “పాన్-ఇండియా సినిమాల పేరుతో భారీ బడ్జెట్‌ను చూపిస్తూ, అసలు ఖర్చు కావాల్సిన చోట ఖర్చు పెట్టకుండా అవాస్తవిక సెట్లు, గ్రాండియర్ ప్రెజెంటేషన్ కోసం మితిమీరిన పెట్టుబడులు పెట్టడం అనర్థకమే. పైగా, ఈ తరహా చిత్రాల్లో విజయం సాధించేది శాతం కూడా ఉండదు” అని విమర్శించారు.

విజయవంతమైన చిత్రాల అనుకరణపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. “‘యూరి’ హిట్ అయితే, వెంటనే దేశభక్తి సినిమాల పరంపర మొదలవుతుంది. ‘బాహుబలి’ వచ్చిన తర్వాత అంతా భారీ యాక్షన్ సినిమాల వైపు పరుగులు తీస్తారు. ‘కేజీఎఫ్’ విజయంతో అదే ట్రెండ్. కానీ, ఇక్కడ అసలైన కథలు, న్యాయమైన నిర్మాణ విలువలు మిస్సవుతున్నాయి” అని ఆయన వివరించారు. పాన్-ఇండియా సినిమాలు అనగా ఒకే సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలయ్యే మల్టీ-లాంగ్వేజ్ సినిమాలే. 2015లో ‘బాహుబలి’ సృష్టించిన ప్రభావం తర్వాత ఈ తరహా చిత్రాలకు విపరీత డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ వంటి సినిమాలు ఈ ట్రెండ్‌ను మరింత బలపరచాయి. ఇదిలా ఉండగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘కెన్నెడీ’ చిత్రం ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. నటుడిగా ఆయన ‘రైఫిల్ క్లబ్’, ‘విడుదలై పార్ట్ 2’ వంటి చిత్రాల్లో ఇటీవల కనిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news